padyam-hrudyam

kavitvam

Sunday, October 22, 2017

కావ్య కంఠ వాశిష్ఠ గణపతి ముని (౩)


వైద్యనాద్ వెళ్లి తపస్సు చేసి సురేష మిత్రుని వద్ద ‘’తారా’’మంత్రోపదేశం పొందాడు .గణపతి గారి వల్లే ఉత్తరాదికే పరిమిత మైన ఈ మంత్రం దక్షిణాదికి చేరింది .పదవ రోజు రాత్రి శివుడు కలలో కన్పించి నిర్విషయ ధ్యాన రూపం అయిన ‘’స్మృతి మార్గం ;;చూపించి ,విభూతి చల్లి అదృశ్యమైనాడు.
గద్వాల్ చేరి మహారాజుకు ఆప్తుడై ,కాన్పూర్ వెళ్లి మూడు నెలలు తపస్సు చేసి ,మళ్ళీ ఇంటికి వెళ్లి తండ్రికి నేత్ర చికిత్స చేయించాడు .1902 లో భార్య తో సహా మందస వెళ్లి రాజు గారి ఆతిధ్యం పొంది ,భార్యను పుట్టింటికి పంపి, తమ్ముడు శివ రామ శాస్త్రి తో కలిసి భువనేశ్వర్ లో మళ్ళీ తపస్సు చేసి కలకత్తా చేరాడు .అక్కడినుంచి దక్షిణ దేశం చేరి క్షీరవతీ ,వేగావతీ నాడు మద్య శివ పంచాక్షరి జపించి ,,అరుణాచలం చేరి తన తపో సాధనకు అదే సరైన ప్రదేశం గా భావించి అక్కడే ఉందామని నిర్ణ యించుకొన్నాడు .
కానీ అన్నదమ్ములిద్దరికి పిడికెడు అన్నం పెట్టె వారే కరువైనారు .గణతి కి ఆ క్షేత్ర దేవత పై కోపం వచ్చింది .ఆకలి దహిస్తోంది .వెంటనే ఒక బ్రాహ్మణుడు వచ్చి తన భార్య వ్రతం చేసి పారణ ను బ్రాహ్మణులకు ఇవ్వాలని అనుకుంటున్నది భోజ నానికి రమ్మని చెప్పి తీసుకొని వెళ్లాడు .అక్కడ ఆమె మృష్టాన్న భోజనం పెట్టింది .సంతృప్తిగా తిన్నారు ..ఆ ఇంట్లోనే విశ్రాంతి తీసుకొన్నారు .తెల్ల వారి లేచి చూస్తె అక్కడ ఇల్లే లేదు .అరుణా చలేశ్వరుడే తమల్ని పిలుచుకొని వెళ్ళాడని అమ్మ వారు’’ ఆపీత కుచామ్బే’’ తమకు భోజనం పెట్టిందని గ్రహించాడు .కాని నోట్లో తాంబూలం అట్లాగే ఉండటం ఆశ్చర్యం వేసింది .అది కల కాదు నిజం అని తెలుసు కొన్నాడు .అప్పటికి గణపతి అయిదు కోట్ల శివ పంచాక్షరి ని జపించి నందుకు అమ్మవారే స్వయం గా కన్పించి ఆతిధ్యం ఇచ్చిందని అర్ధ మయింది .ఇక మానవ మాత్రులెవరిని దేహీ అని అర్ధించ రాదనీ నిశ్చయించు కొన్నాడు.
.రోజు అరుణాచల నందీశ్వరుని ముందు నిలిచి శ్లోకాలను అరుణా చలేశ్వరునికి విని పిస్తూ ‘’హరస్తుతి ‘’కావ్యం రచించాడు .చివరి రోజు న అరుణాచల యోగులు శేషాద్రి స్వామి ,బ్రాహ్మణ స్వామి (రమణ మహర్షి )ఆ కావ్యం విని ఆనదించారు .అక్కడి విద్యాలయం లో ఈయనకు సంస్కృత అధ్యాపక పదవి లభించింది .పది రోజుల్లో తమిళం నేర్చి ,ఆ భాష లో బోధించటం ప్రారంభించి మెప్పు పొందాడు .1903 లో రమణ మహర్షిని దర్శించాడు .ఆయనేదుర్గా మందిర యోగి చెప్పిన ‘’స్థూల శిరస్సు ‘’అని గుర్తించి నమస్కరించాడు .అప్పుడు రమణుల వయస్సు ఇరవై రెండు .గణపతి వయస్సు ఇరవై అయిదు .అలా చారిత్రాత్మకం గా కలిసిన వారిద్దరూ జీవికా జీవులు గా ఉండి పోయారు
శ్రీకావ్య కంఠ వాసిష్ఠ గణపతి ముని(నాయన) రమణ మహర్షిని ఆస్తిక లోకానికి పరిచయం చేసి మహోపకారాన్ని చేశారు. వీరు కడు మేధావులు. వంగదేశం (బెంగాల్)లోని నవద్వీప నగరంలో పాండిత్య పరీక్షల కోసం జరిగే పండిత సభలో పండితులందరినీ అబ్బురపరిచే రీతిలో నాయన తన ప్రతిభను చూపారు. అక్కడ ఒక వృద్ధ పండితుని చూసి ఎవరీయన అని తన పక్కన వారిని నాయన అడిగారట. ‘‘అతడే పరీక్షాధికారి, ఆశుకవి, అంబికాదత్తుడు’’ అని బదులిచ్చాడట పక్కనున్న వ్యక్తి. ఇంతలో అంబికాదత్తుడే వచ్చి, ‘‘నేను ఆశుకవితా జనకుడను, గౌడుడను. నా పేరు అంబికాదత్తు’’ అని సంస్కృతంలో చెప్పగా, దానికి నాయన ఏమాత్రం తడబడకుండా, ‘‘నేను కవికులానికి అధిపతిని. అతిదక్షుడను. దాక్షిణాత్యుడను. నా పేరు గణపతి’’ (నీవు కేవలం అంబికకు దత్తుడవు మాత్రమే. నేను సాక్షాత్తూ అంబికకు పుత్రుడను అని నాయన చేసిన చమత్కారంతో అంబికా దత్తుడికి నాయన పాండిత్య ప్రతిభ తెలియకనే తెలిసింది) అని సంస్కృతంలోనే జవాబిచ్చారు. ఆ తరువాత ఆ సభ పెట్టిన పరీక్షలన్నిటిలోనూ నాయన తన ప్రతిభ చాటి, తన అసమాన ప్రతిభతో అందరినీ ముగ్ధుల్ని చేశారు. ఆనాటి అచటి విద్వత్పరిషత్తు నాయనకు కావ్య కంఠ బిరుదునిచ్చి సత్కరించింది. ఇది 20.06.1900 నాడు జరిగిన సంఘటన. అలా నాయన, పండితుల మహాసభలో తన అసమాన ప్రతిభను కనబరిచి ‘‘కావ్యకంఠ’’ బిరుదును పొందారు. కావ్యకంఠ గణపతిగా ప్రసిద్ధికెక్కారు.
చి.సౌ. శీమతి నాగబంది శ్రీలక్ష్మి సౌజన్యత తో...

No comments: