padyam-hrudyam

kavitvam

Wednesday, October 25, 2017

కావ్యకంఠ గణపతి ముని (1878-1936) : (5)


ఒక నవయువకుని నవద్వీప విజయం - పప్పు నాగరాజు
***
అది 1900 సంవత్సరం, జూన్ నెల. దేశం నలుమూలలనుంచీ కవులూ, పండితులూ ఉత్సాహంగా, ప్రతిసంవత్సరం జరిగే పండిత సభలలో పాల్గొనడానికి కాశీ దగ్గరున్న నవద్వీపం చేరుకొన్నారు. అమరావతి, నలందా, ఉజ్జయిని, నవద్వీపం మనదేశంలో అతి ప్రాచీనకాలం నుంచీ పేరుగడించిన విద్యాపీఠాలు. సకల శాస్త్రాలు అక్కడ బోధించేవారు. సరస్వతికి నాలుగు ముఖాలైన – పండితులు, కవులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలతో ఈ నాలుగు నగరాలు ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉండేవి. కాలక్రమంలో అమరావతి, నలందా, ఉజ్జయిని తమ పూర్వ ప్రాభవాన్ని కోల్పోయినప్పటికీ, నవద్వీపం మాత్రం అప్పటికింకా ఉత్తరదేశంలో కాలు నిలదొక్కుకోగలిగింది. అక్కడి హరిసభలో ప్రతి సంవత్సరం పండిత పరీక్ష సభలు జరిగేవి. ఈ పరీక్షలో నెగ్గినవారికి, వారి పాండిత్యానికి తగ్గట్టు బిరుదునిచ్చి సత్కరించేవారు. అప్పటికి, ఈ సభలకి దక్షిణ దేశం నుంచీ ఎవరూ పెద్దగా వచ్చేవారు కాదు. దక్షిణాది వాళ్ళంటే నవద్వీపవాసులకి కొంచెం చిన్నచూపు కూడా.
ఆ సంవత్సరం మాత్రం, తెలుగునాట నుంచి అక్కడ జరిగే పండిత పరీక్షలలో తన సత్తా నిరూపించుకోడానికి ఒక యువకుడు వచ్చాడు – వయస్సు 22 సంవత్సరాలు – పేరు గణపతి శాస్త్రి. వయసులో చిన్నవాడైనా, అప్పటికే గణపతి శాస్త్రి సకల శాస్త్ర పారంగతుడు, ఆశుకవితా దురంధరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఏకసంథాగ్రాహి – ఆపైన ఉపేంద్రుడినైనా లెక్కచెయ్యని ఉడుకు రక్తం. అంతకు ముందు, కాశీలో శివకుమారుడనే ప్రఖ్యాతి గాంచిన పండితుడు తనకిచ్చిన యోగ్యతా పత్రం ఒకటి ఈ యువకునికి పరీక్షలలో పాల్గొనే అవకాశం కల్పించటానికున్న ఒకే ఒక్క ఆధారం.
శితికంఠ వాచస్పతి అనే మహా పండితుడు అప్పుడు సభాపతి. పరీక్షలలో పాల్గొనదలిచేవాళ్ల యోగ్యతలు పరీక్షించి, పరీక్షకి అనుమతి ఇవ్వవలిసిందీ వాచస్పతే. గణపతి కొంత కష్టం మీద వాచస్పతి దర్శనం సంపాదించేడు. తనకి శివకుమారుడిచ్చిన యోగ్యతా పత్రాన్ని వాచస్పతికి వినయంగా చూపించాడు. ఆ ఉత్తరంలో మెదటి వాక్యం –దేవాసుర సమీకేషు బహుశోదృష్ట విక్రమః అనుంది. ఇది రామాయణంలో హనుమంతుని యుద్ధపరాక్రమము దేవతా ప్రశంసనీయమని కీర్తించే శ్లోకం. అది చూడగానే, వాచస్పతి గణపతినింకేమీ ప్రశ్నలు అడగకుండానే, ప్రత్యేక పరీక్షకి అనుమతినిచ్చి తన దగ్గరే ఉంచుకొన్నాడు. మర్నాడు, తనే స్వయంగా గణపతిని సభామంటపానికి తోడ్కొనిపోయాడు.
ఆ ఏడాది, ఆశుకవిత్వంలోనూ, శాస్త్ర సాహిత్యంలోనూ ఉత్తరదేశంలో తనంతవాడు లేడని కీర్తిగాంచిన అంబికాదత్తుడు పరీక్షాసంఘానికి అధ్యక్షుడు. అప్పటికే ఆయన వేదికనలంకరించి ఉన్నాడు. వేలకొలదీ ప్రేక్షకులు, పండితులతో సభ కన్నులపండుగగా ఉంది. సభ ప్రారంభించే లోపు గణపతిని అధ్యక్షుడికోసారి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో వాచస్పతి, గణపతి తన వెంట వస్తుండగా అధ్యక్షపీఠం వద్దకి చేరుకొన్నాడు.
అధ్యక్షపీఠాన్ని అలంకరించియున్న అంబికాదత్తుడి గంభీరాకృతి గణపతి దృష్టినాకట్టుకొంది.
బాల్య చాపల్యంతో “కోసౌ మహాశయః” అని వాచస్పతిని ప్రశ్నించాడు. అంత సమీపంలో అంబికాదత్తుడికి వినిపించేటట్టుగా అలా గణపతి అడిగేసరికి పాపం వాచస్పతి కాస్త తెల్లబోయాడు. అంబికాదత్తుడు సరసుడు, రసజ్ఞుడు. తొణకకుండా, గంభీరంగా చిర్నవ్వు నవ్వి:
సత్వర కవితా సవితా గౌడోహం కశ్చిదంబికాదత్తః
అంటూ, తన దేశ, నామ, సామర్థ్యాలు మూడూ గణపతికి చెప్పి, తెలివిగా శ్లోకంలో ఒక్కపాదమే చెప్పి, ఇక నీ పరిచయమేమిటి అన్నట్టుగా మిగతా సగభాగం చమత్కారంగా విడిచిపెట్టాడు. అది గ్రహించిన గణపతి తడుముకోకుండా వెంటనే:
గణపతి రితి కవికులపతిరతి దక్షో దాక్షిణాత్యోహం
ఈ విధంగా తాను కూడా, తన దేశ, నామ సామర్థ్యాలు ఒక్క పాదంలోనే ఇమిడ్చి, అధ్యక్షుడికంటే తానే అధికుడినన్నట్టుగా కవికులపతి అంటూ ఒక చమత్కారబాణం విసిరి, అంతటితో ఊరుకోకుండా – భవాన్ దత్తః, అహంత్వౌరసః (నీవు అంబికకి దత్తుడివి మాత్రమే, నేను ఔరస పుత్రుడిని) అని అంబికాదత్తుడి అహాన్ని రెచ్చగొట్టాడుకూడా. సభలోని వారందరూ, వాచస్పతితో సహా – ‘ఎవడీ యువకుడు, సింహం జూలుపట్టి లాగుతున్నాడే, పర్యవసానం ఎరుగుదుడా’ అని నివ్వెరపోయారు. అంబికాదత్తుడు మాత్రం చలించలేదు. వెంటనే గణపతిని వేదిక మీదకి రమ్మని సంజ్ఞ చేసి, వెనువెంటనే నాలుగు సమస్యలు ఇచ్చి వాటిని పూరించమన్నాడు. ( సశేషం)
***
చి. సౌ. శ్రీమతి నాగబంది శ్రీలక్ష్మి సౌజన్యతతో...

No comments: