padyam-hrudyam

kavitvam

Sunday, October 6, 2013

మసలుమమ్మ నాదు మదిని నీవు.






ఏ దేవి క్షుత్తుగా నెల్ల జీవుల నుండు
..........నామెకు తలవంచి నతులొనర్తు!
ఏ దేవి తృష్ణయై యెల్ల ప్రాణుల నుండు
..........నా దేవి కేను ప్రణతు లొనర్తు!
ఏ దేవి జాతిగా నెల్ల జీవుల నుండు
..........నామెకు ప్రణమిల్లు దాదరమున!
ఏ దేవి లజ్జయై యెల్ల ప్రాణుల నుండు
..........నా దేవికి నమస్సు లందు నెపుడు!

సకల భూతాంతరంగయై సర్వ కాల
సర్వ దశలందు వెల్గెడు శక్తి కనెద!
దండమో దేవి! దండము దండమమ్మ!
దండమో తల్లి! దయజూడు దండమమ్మ!

శైలజవై గిరీంద్రునకు జన్మ తరింపగ జేసి, దివ్యమౌ
లీలల తల్లిదండ్రులకు ప్రీతిని జేసి, తపించి, శాంభవీ!
నీలగళున్ మదిన్నిలిపి, నిండితివమ్మ సగమ్ము మేన సు-
శ్రీల నొసంగవే నిను భజించెద నీ నవరాత్రి వేళలో.

శైలపుత్రి వీవు! చల్లని తల్లివి!
కొల్చు వారి పాలి కొంగు పైడి!
మంచుకొండ యింట మసలిన రీతిని
మసలుమమ్మ నాదు మదిని నీవు.

No comments: