padyam-hrudyam

kavitvam

Saturday, December 7, 2013

నెల్సన్ మండేలాకు నివాళి.





విశ్వమాత  కనుల వెంట దుఃఖాశ్రువుల్  
కారు చుండె గనుడు ధారగాను 
నల్ల జాతి వెలుగు నవ్వుల సూరీడు 
గ్రుంకె నన్న వార్త క్రుంగ దీసె. 

జాత్యహంకార ప్రభువుల జాడ్య మేమొ 
సాటి మానవుల యెడన్ జాలి లేక 
నల్ల వారని హింసించి తెల్లవారు 
బానిసల జేసి రక్కటా బాధపెట్టి.

పెద్ద సంఖ్యలో నుండియు పేదవారు 
నల్ల వారైన కతమున నాణ్యమైన 
బ్రతుకు తెరువును పొందక పరువు మాసి 
దొరల కాళ్ళను పట్టెడి  దుర్గతేల. 

కలల నైన తమకు కార్లు సౌధమ్ములు 
కోరినారె వారు కూటి కొఱకు 
మోము వాచి పసుల పోలిక గొలుసుల 
బంది లగుచు మ్రగ్గు  బ్రతుకదేల.. 

వారును కారె మానవులు వారికి నాకలి దప్పులుండవే  
వారి నరాల పారు రుధిరమ్మరుణమ్మది కాదె వారినిన్ 
క్రూరత జేసి బానిసల, కొద్ది జనుల్ తెలుపైన వారిలన్,
దూరుచు నంట రారనుచు ద్రోహము జేతురె ఘోర మక్కటా.

వర్ణవివక్షకున్ భరత వాక్యము పల్కిన గాని గుండెలో 
నర్ణవ మైన వేదనకు నంతము లేదని యెంచి దీక్షతో 
పర్ణములే భుజించి తపమున్ పచరించెడు మౌని పోలికన్ 
నిర్ణయ మూని డెందమున నీవు తపించితివయ్య మండెలా.

దేశ ద్రోహి వటంచు తెల్ల ప్రభువుల్ తీర్మానమున్ జేసినన్    
లేశంబైనను జాలి లేక యొక జైలే సృష్టిగా మార్చినన్ 
ఆశల్ జూపిన గాని లొంగ వకటా ఆత్మీయ జాత్యర్థమై 
క్లేశంబుల్ భరియించి నావు జన సంక్షేమంబు కై దీక్షతో.

యౌవన మంతయు జారిన 
నే వెల్గులు లేని రీతి నిరుకగు  జైలున్  
చేవ నశింపక పోరిన 
యో వీరా నిన్ను దలతు నుల్లము పొంగన్.

పండెను నీకల! నలుపుల 
గుండెల చల్లారె మంట! కూరిమి నేళ్ళున్ 
నిండెను నూరును దొరలకు, 
మండేలా! వందనములు, మరిమరి నుతులున్. 

భువిని విడచి పెట్టి దివికి నీవేగినన్ 
నీదు పోరు బాట నిలిచి చూపు 
మంచి మానవత్వ మెంచగ విజయమ్ము 
నొందు దారి మాకు నో మహాత్మ!


No comments: