padyam-hrudyam

kavitvam

Monday, March 17, 2014

వసంతోత్సవం..........




గోకులమ్ము లోన నాడు గోపబాలు రందరున్ 
వేకువన్ యశోదపట్టి వెంటనంటి వీధులన్ 
చీకు చింత మరచి యాడ చేరి రంగులాటలన్ 
నాక వాసు లరగి నారు నంద వ్రజము జూడగన్.

రంగురంగు పూల తోడ రమ్యమైన వనులలో 
హంగుగాను రంగులెల్ల నలదుకొనుచు నొండొరుల్ 
నింగి నేల జేసినారు నెలవు వర్ణశోభలన్ 
పొంగె యమున పట్టలేక, ప్రొద్దు వాలె నంతలో 

బాలకృష్ణు డాన్చ వేణు వల్ల నల్ల నోష్ఠమున్ 
జాలు వారె పాట మంద్రజాల మహిమ జూపుచున్ 
గాలి నింగి నీరు నేల కమ్మనైన పాటకున్ 
సోలి పోయె కరగి పోయె చోద్య మాయె నంతటన్ 

గోపబాలు రాట మరచి గోపబాలు వంకకే 
చూపులన్ని నిలపినారు చుట్టు జేరినారదే 
గోపకాంత లిహము మరచి కూర్మి కృష్ణు డొక్కడే 
తోప వారి వారి చెంత త్రుళ్ళి త్రుళ్ళి యాడిరే 

వేణు గాన లహరి లోన విశ్వవిభుడు సర్వులన్ 
తాను తక్క నన్య మేమి ధరణి లేని రీతిగన్ 
పూని యోల లాడ జేయ పులకరించి రెల్లరున్
ప్రాణికోటి పరవశించె రమ్యవర్ణ శోభలన్ 

'ఏమి జన్మ మిట్టి నాక మేల మాకు నేడహో 
భూమి పైన పుట్టి యున్న పొందుగూడి కృష్ణునిన్ 
మేము గూడ యాడి పాడి మిడిసిపడుదు మయ్యయో
ఏమి భాగ్య ముర్వి జనుల' కిట్లు సురలు వగచిరే

మోహనాంగు రాస లీల ముగ్ధమై రహించగన్ 
దేహ భ్రాంతి వీడి నాడు దివ్య గాన లహరిలో 
నాహ యంచు జీవు లెల్ల నైక్యమై తరించగన్ 
సోహ మన్న భావ మేలె చూడ నుర్వి నంతటన్.

No comments: